: దటీజ్ శశికళ!.. శపథం చేసి మరీ అసెంబ్లీకి!
జయలలిత మరణానంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమె నెచ్చెలి శశికళ ఆ వెంటనే వేషధారణ మార్చేశారు. అచ్చం ‘అమ్మ’లా వస్త్రధారణ చేసుకున్నారు. అమ్మలానే శపథం చేసి మరీ ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. అప్పట్లో జయలలిత అసెంబ్లీలో తనకు జరిగిన ఘోర అవమానానికి స్పందిస్తూ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేసి మరీ అనుకున్నది సాధించారు. ఇప్పుడు శశికళ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.
జయ మరణం తర్వాత ముఖ్యమంత్రిగా పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం.. జయ మృతికి సంతాపం తెలిపే సమయంలో అసెంబ్లీకి రావాల్సిందిగా శశికళను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని శశికళ సున్నితంగా తిరస్కరించారు. తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని తేల్చి చెప్పారు. అంతేకాదు అప్పటి వరకు అటువైపు కన్నెత్తి కూడా చూడనని శపథం చేశారు. ఆదివారం శశికళ శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కావడంతో ఆమె శపథం నెరవేరినట్టే. మంచి ముహూర్తం చూసుకుని నేడో, రేపో ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫలితంగా ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆమె కోరిక నెరవేరబోతోంది.