: డొనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రిక‌ల‌ను లెక్క‌చేయ‌ని ఇరాన్‌... ఆయుధ సంపత్తి ప్రదర్శన!

తాము అణు క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు ఇటీవ‌లే స్ప‌ష్టం చేసిన ఇరాన్ ప‌ట్ల అమెరికా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇరాన్‌పై దృష్టి పెట్టాల‌ని కూడా అమెరికా నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో అమెరికా ఆంక్షలు విధించిన మరుస‌టి రోజే ఇరాన్‌ తన సైనిక విన్యాసాల్లో క్షిపణులను ప్రదర్శించి సాహసం చేసింది. అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం ఇరాన్‌తో ఆ దేశ‌ సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీనికి తోడు ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన గంటల వ్యవధిలోనే పెంటగాన్‌ చీఫ్‌ జేమ్స్‌ మ్యాటిస్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధికంగా ప్ర‌భుత్వం ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం ఇరాన్‌లోనే ఉందని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు రివల్యూషనరీ గార్డ్స్‌(ఇరాన్‌ సైన్యం) చేస్తున్న విన్యాసాల్లో 75 కిలోమీటర్ల రేంజి క్షిపణులను ప్రదర్శించారు.
ఈ ప్ర‌ద‌ర్శ‌న‌పై ఇరాన్ సైన్యం స్పందిస్తూ.. తాము దేశీయంగా తయారు చేసిన వివిధ రాడార్‌ వ్యవస్థలు, క్షిపణి వ్యవస్థలు, యుద్ధనైపుణ్యాలను ప్రదర్శించినట్లు తెలిపింది. త‌మ దేశంలో జ‌రగనున్న ‘ఫ్రీస్టైల్‌ ప్రపంచ కప్‌’ పోటీల్లో అమెరికా రెజ్ల‌ర్లు పాల్గొనకుండా కూడా ఇరాన్ నిషేధం విధించిన విష‌యం తెలిసిందే.

More Telugu News