: మహిళల క్రికెట్‌ విస్తరణ లింగ సమానత్వం, హక్కులకు ఉత్ప్రేరకం వంటిది: సచిన్

ఈ ఏడాది జూన్‌-జులైలో ఐసీసీ మహిళల ప్రపంచకప్ టోర్నీ నిర్వ‌హించ‌నున్న‌ నేప‌థ్యంలో టీమిండియా మాజీ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ స్పందిస్తూ ఆ ప్ర‌పంచ క‌ప్ టోర్నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాన‌ని అన్నాడు. ప్రపంచకప్‌ క్రికెట్‌లో థాయ్‌లాండ్‌ అరంగేట్రం చేయడం త‌న‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింద‌ని చెప్పాడు. ఈ ప్ర‌పంచ క‌ప్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొందరు అత్యుత్తమ మహిళా క్రికెటర్లు పాల్గొంటార‌ని, అటువంటి ఆటను కొన్ని నెలల్లో వీక్షించబోతున్నామని స‌చిన్ అన్నాడు. మహిళల క్రికెట్‌ విస్తరణ లింగ సమానత్వం, హక్కులకు ఉత్ప్రేరకం అని స‌చిన్ అభివర్ణించాడు.

మహిళా క్రికెటర్లు త‌మ ఆట‌తీరుతో యువతులను క్రికెట్‌ వైపున‌కు ఆక‌ర్షిస్తున్నార‌ని చెప్పాడు. టీమిండియా జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, ఆల్‌రౌండర్‌ ఝూలన్‌ గోస్వామి రానున్న ప్ర‌పంచ‌క‌ప్‌లో అద్భుతంగా రాణిస్తార‌ని ఆయ‌న అన్నాడు. మ‌రోవైపు, దక్షిణాఫ్రికా క్రీడాకారిణులు మిగ్నాన్‌ డు ప్రీజ్‌, డేన్‌ వాన్‌ నీకెర్క్‌, మరిజన్నె కాప్‌, పాకిస్థాన్ క్రికెటర్లు బిస్మా మరూఫ్‌, సనా మిర్ వంటి క్రీడాకారిణులు మంచి ఆట‌తీరుతో మ‌హిళా క్రికెట్ టోర్నీల‌ప‌ట్ల ఆస‌క్తి పెంచేలా చేస్తున్నార‌ని ఆయ‌న అన్నాడు.

More Telugu News