: ఆ ప్రాజెక్టుపై విచారణ జరిపేందుకు ఓ కానిస్టేబుల్‌ చాలు: వైఎస్‌ జగన్‌

 ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఈ రోజు క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌
పైడిపాలెం రిజర్వాయర్‌ను ప‌రిశీలించారు. ఆ రిజ‌ర్వాయ‌ర్‌కు సంబంధించి 80 శాతం పనులు దివంగత ముఖ్య‌మంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హ‌యాంలోనే పూర్త‌య్యాయ‌ని తెలిపారు. మ‌రోవైపు ఆ రిజ‌ర్వాయ‌ర్ ప‌నుల‌న్నీ తానే చేశానంటూ ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు గొప్ప‌లు చెప్పుకుంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ‌కు రూ.300 కోట్లు ఖర్చు పెడితే ఇప్ప‌టికే ఆ ప్రాంతం సస్యశ్యామలమయ్యేదని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి అక్క‌డి ప్రాజెక్టులపై కన్నా కాంట్రాక్టుల మీద వచ్చే కమీషన్ల మీదే ఆస‌క్తి పెడుతున్నార‌ని జగన్ చెప్పారు. కేవ‌లం ప్ర‌చార ఆర్భాటాలు చేస్తూ చంద్రబాబు నాయుడు ప్ర‌జ‌లను మ‌భ్య‌పెడుతున్నార‌ని అన్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు పనులపై విచారణ జరిపేందుకు ఓ కానిస్టేబుల్‌ చాలని ఆయ‌న అన్నారు. సర్కారు రూ.120 కోట్ల పరిహారం చెల్లిస్తే పులిచింతలలో 45 టీఎంసీల నీరు నిల్వ అయ్యేద‌ని ఆయ‌న అన్నారు. దానితో పాటు మ‌రోవైపు ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా సముద్రంలో కలిసే 55 టీఎంసీల నీటిని సంర‌క్షించుకునేవారిమ‌ని జ‌గ‌న్ చెప్పారు.

More Telugu News