: గతంలో బెంగళూరు ఏటీఎంలో మహిళను హత్యచేసిన కిరాతకుడు ఇప్పుడు దొరికాడు!

2013లో బెంగళూరులో జరిగిన ఓ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఏటీఎంలో ఉన్న ఓ మహిళను ఓ కిరాతకుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తి పేరు మధుకర్ రెడ్డి. మూడేళ్ల క్రితం కడప జైలు నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరులో హత్యకు పాల్పడ్డాడు. తాజాగా, మధుకర్ రెడ్డి వారం క్రితం చిత్తూరు జిల్లా మదనపల్లి టూటౌన్ పోలీసులకు చిక్కాడు. అతడిని విచారించిన పోలీసులు రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. 2013 నవంబర్ 19న ఉదయం 7 గంటల సమయంలో ఏటీఎంలోకి చొరబడ్డ మధుకర్... లోపల ఉన్న మహిళపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

తొమ్మిది సంవత్సరాల క్రితం మదనపల్లి సమీపంలోని పీటీఎం మండలంలో బాంబు దాడి చేసి, ఒకరిని హత్య చేసిన కేసులో... కడప సెంట్రల్ జైల్లో మధుకర్ శిక్షను అనుభవిస్తున్నాడు. అక్కడ నుంచి మూడేళ్ల క్రితం పరారయ్యాడు. నేరుగా బెంగళూరు చేరుకున్న మధుకర్... ఏటీఎంలో మహిళను హత్య చేశాడు. అప్పట్నుంచి మధుకర్ రెడ్డి ఎవరికీ కనిపించలేదు. సరిగ్గా వారం క్రితం మదనపల్లిలోని తన ఇంటికి వస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన మధుకర్ ను ఐడీ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరపగా, బెంగళూరులో మహిళను తానే హత్య చేసినట్టు మధుకర్ ఒప్పుకున్నాడని సమాచారం. రేపు మీడియా సమావేశంలో పోలీసులు అన్ని విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.  

More Telugu News