: ఆర్మీ ఉద్యోగి వేధింపులకు యువతి బలి!

వివాహానికి నిరాకరించారని వేధింపులకు దిగడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్టణం జిల్లా యలమంచిలి మండలం రేగుపాలెంకు చెందిన పావని ప్రియాంక బీటెక్ చదువుతోంది. ఆమెను వివాహం చేసుకుంటానని ఆర్మీ ఉద్యోగి నర్సింగరావు కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో రెండు కుటుంబాల అంగీకారంతో వివాహం నిశ్చయమైంది. ఆ తరువాత అతని ప్రవర్తనతో విసిగిపోయిన పావని కుటుంబ సభ్యులకు అతని గురించి వివరించడంతో అతనితో వివాహం రద్దు చేసుకున్నారు.

దీంతో ఆమెపై కక్షగట్టిన నర్సింగరావు, నిశ్చితార్థం సందర్భంగా ఆమెతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని, తాను చెప్పినట్టు వినాలని, వివాహానికి అంగీకరించాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. దీంతో ఆ వేధింపులను కుటుంబ సభ్యులకు చెప్పుకోలేకపోయిన పావని, స్నేహితులతో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. అతని వేధింపులు పెరిగిపోవడంతో ఇంటికి వచ్చిన పావన్ ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో స్నేహితులు జరిగిందంతా చెప్పడంతో అతనిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

More Telugu News