: ఇంతవరకు ట్రంప్ చేసిన చెత్త ఫోన్ కాల్ అదేనట..!

వివిధ దేశాలతో సంబంధాలు బలపరచుకునే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పలు దేశాధినేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్ బుల్ కు చేసిన ఫోన్ కాల్ ను ఆయన తాను చేసిన అత్యంత చెత్త కాల్ గా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి టర్న్ బుల్ తో ట్రంప్ ఫోన్ సంభాషణ గంటపాటు సాగుతుందని అంతా భావించారు. అయితే అంచనాలను తల్లికిందులు చేస్తూ కేవలం 25 నిమిషాల్లోనే వారి సంభాషణ ముగియడం విశేషం. ఈ సందర్భంగా రెండు దేశాధినేతల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

మాజీ అధ్యక్షుడు ఒబామాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆస్ట్రేలియా శరణార్థులను అమెరికాలోకి అనుమతించాలని టర్న్ బుల్ కోరగా, దానిని ట్రంప్ తిరస్కరించినట్టు సమాచారం. దీంతో టర్న్ బుల్ దానిపై వివరించే ప్రయత్నం చేయగా, 'మమ్మల్ని చంపేందుకు బోస్టన్ బాంబర్లను మరోసారి మా దేశంలోకి పంపాలనుకుంటున్నారా?' అంటూ గట్టిగా ప్రశ్నించారట. అంతే కాకుండా దానిని తాను అంగీకరిస్తే అదో చెత్త డీల్ అవుతుందని టర్న్ బుల్ కు స్పష్టం చేశారట. దీంతో వారి మధ్య సంభాషణ ముగిసిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా ట్రంప్ తన సన్నిహితులతో తాను చేసిన కాల్స్ లో అత్యంత చెత్త కాల్ అదేనని పేర్కొన్నారని సమాచారం. 

More Telugu News