: ఈ బడ్జెట్‌లోనే తెలంగాణ ఎయిమ్స్‌కు నిధులు కేటాయించినట్లు భ‌రోసా ఇచ్చారు: ఎంపీ జితేంద‌ర్ రెడ్డి

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్ల‌మెంటులో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన త‌రువాత తాము ఆయ‌న‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యామ‌ని టీఆర్ఎస్ ఎంపీ జితేంద‌ర్‌రెడ్డి అన్నారు. గ‌తంలో తెలుగు రాష్ట్రాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఎయిమ్స్ ప్రకటించిన నేపథ్యంలో తాము ఈ రోజు తెలంగాణలో ఎయిమ్స్ అంశంపై జైట్లీతో మాట్లాడామ‌ని తెలిపారు. కొత్త విధానం వల్ల సభలో తెలంగాణకు ఎయిమ్స్ అంశంపై మాట్లాడలేదని జైట్లీ త‌మ‌కు చెప్పార‌ని ఆయ‌న అన్నారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ ఎయిమ్స్‌కు నిధులు కేటాయించినట్లేనని జైట్లీ త‌మ‌కు భ‌రోసా ఇచ్చినట్లు ఆయ‌న చెప్పారు.

ర‌ైల్వే బ‌డ్జెట్‌ను సాధార‌ణ బ‌డ్జెట్‌లో విలీనం చేస్తూ కొత్త విధానంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగుందని జితేందర్‌రెడ్డి అన్నారు. గతంలో మాదిరిగా ప్రణాళికా కేటాయింపులను సభలో ప్రకటించే సంప్రదాయానికి కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌స్తి చెప్పింద‌ని ఆయ‌న తెలిపారు.
ఇక‌పై కేంద్ర మంత్రిత్వ శాఖలకు కేటాయించిన బడ్జెట్ నుంచే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు పొందాల్సి ఉంటుందని ఆయ‌న వివ‌రించారు. కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఈ విధానంతో పెండింగ్ పనులు వేగంగా జ‌రుగుతాయ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

More Telugu News