: గణనీయంగా పెరిగిన యాపిల్‌ ఐఫోన్‌ అమ్మకాలు... హర్షం వ్యక్తం చేసిన యాపిల్ సీఈవో

టెక్‌ దిగ్గజం యాపిల్‌కు తాజా క్వార్టర్‌ ఫలితాలు ఊర‌ట క‌లిగించాయి. గ‌త కొంత కాలంగా ఐఫోన్ అమ్మ‌కాలు త‌గ్గిపోవ‌డంతో ఆ కంపెనీ నిరాశ‌తో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, ఇటీవ‌ల‌ ఐఫోన్‌ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దీంతో యాపిల్ రికార్డు ఆదాయాన్ని సంపాందించింది. గత ఏడాది యాపిల్ తీసుకొచ్చిన ఐఫోన్‌-7కు భారీ డిమాండ్‌ ఏర్పడటం ఆ సంస్థ‌కు నూత‌న ఉత్సాహాన్నిచ్చింది. గడచిన త్రైమాసికంలో ఆ సంస్థ‌ 78.4 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకు ముంద‌టి ఏడాది ఇదే త్రైమాసికానికి ఆ సంస్థ‌ రెవెన్యూ 75.9 డాలర్లుగా మాత్రమే న‌మోదైంది.

కాగా, యాపిల్ సంస్థ‌ ఆదాయం పెరిగినప్పటికీ డిసెంబర్‌తో ముగిసే గడిచిన త్రైమాసికంలో లాభం 2.6 శాతం తగ్గింది. దీంతో 17.9 బిలియన్‌ డాలర్లు (రూ. 1.21 లక్షల కోట్లు)గా ఆదాయం న‌మోదైంది. గడచిన హాలిడే త్రైమాసికంలో యాపిల్‌ 7.83 కోట్ల ఐఫోన్లను విక్ర‌యించింది. అంతకుముందు ఏడాది క‌న్నా ఇది ఐదుశాతం ఎక్కువ‌. తమ‌ హాలిడే క్వార్టర్‌ లో గతంలో ఎన్నడూ లేనంత అత్యధికంగా ఆదాయం ఆర్జించడం ప‌ట్ల ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఐఫోన్ అధికంగా పెరిగిపోవ‌డంతో కంపెనీకి గణనీయమైన రెవెన్యూ వచ్చిందని తెలిపింది. స‌ద‌రు సంస్థ‌ ఫలితాలు వెలువడటంతో యాపిల్ షేరు స్టాక్‌మార్కెట్‌లో మూడుశాతం పెరిగి 125.19 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

More Telugu News