: పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే... ముఖ్యాంశాలు

2016-17 బడ్జెట్ ప్రతిపాదనలకు ప్రతిబింబమైన ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందుంచారు. ఈ సంవత్సరం స్థూలజాతీయోత్పత్తి వృద్ధి రేటు 7.1 శాతంగా అంచనా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. వ్యవసాయ రంగంలో 4.1 శాతం వృద్ధి నమోదవుతుందని, ఇది గతేడాది కంటే 1.2 శాతం అధికమని అన్నారు. పారిశ్రామిక వృద్ధి రేటు 7.4 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గవచ్చని, నోట్ల రద్దు చూపుతున్న ప్రభావమే ఇందుకు కారణమని, అయితే ఇది తాత్కాలికమేనని తెలిపారు. జీడీపీలో కరెంట్ అకౌంట్ లోటు 0.3 శాతంగా ఉంటుందన్న సంకేతాలను జైట్లీ ఇచ్చారు.
ముఖ్యాంశాలు...
* ఆర్థిక సర్వేను చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ అరవింద్ సుబ్రమణియన్ తయారు చేశారు.
* బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగే సమయం ఇది. నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి.
* వ్యవస్థలో నల్లధనంగా మిగిలిపోయిన మొత్తం వెలుగులోకి వస్తోంది.
* ఈ డబ్బుతో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టవచ్చు.
* డిజిటలైజేషన్ తో కేంద్ర ఖజానాకు మరిన్ని నిధులు.
* నిర్మాణ రంగం అందుబాటులోకి వచ్చింది. కొత్త గృహాలు మధ్యతరగతికి అందుబాటులోకి రావడం నోట్ల రద్దు సాధించిన పెద్ద విజయాల్లో ఒకటి.
* ఇక జీఎస్టీ అమల్లోకి వస్తే, ప్రజలకు నాణ్యమైన జీవనం దగ్గరవుతుంది.
* ఆర్థిక వ్యవస్థ విస్తరించే కొద్దీ ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
* జీడీపీ తగ్గినట్టు కనిపించడం తాత్కాలికం మాత్రమే.
* ప్రభుత్వానికి వస్తున్న ఆదాయపు పన్ను పెరుగుతోంది.
* విదేశీ కంపెనీల పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నాం.
* మేకిన్ ఇండియాలో భాగంగా ఎన్నో సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి.
* గ్లోబలైజేషన్ కారణంగా అత్యధికంగా లాభపడుతున్న దేశాల్లో భారత్ ఒకటి.
* గడచిన ఏడాది కాలంలో 7 ముఖ్యమైన సంస్కరణలు తీసుకొచ్చాం.
* అవి జీఎస్టీ, అవినీతి నిరోధక బిల్లు, పరపతి విధాన కమిటీ, ఆధార్ బిల్లు, విదేశీ పెట్టుబడుల సరళీకరణ, యపీఐ, కార్మిక రంగ అభివృద్ధి

More Telugu News