: బాలీవుడ్ స్టార్లను ఓడించి, దేశ ప్రజల మనసులు గెలుచుకున్న 'సామాన్యుడు' మన్ వీర్ గుజ్జర్!

బాలీవుడ్ స్టార్ రాహుల్ దేవ్, హిందీ టీవీ నటులు గౌరవ్ కపూర్, రోహన్ మెహ్రా, మాజీ మిస్ ఇండియా లోపముద్ర రౌత్, భోజ్ పురి స్టార్ హీరోయిన్ మోనాలిసా, ఎంటీవీ వ్యాఖ్యత, రోడీస్ విజేత గుర్బానీ జడ్జ్ వంటివారితో పోటీపడిన సామాన్యుడు భారతీయ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 విజేతగా అవతరించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి సెలబ్రిటీలు, 'ఇండియా వాలే' (కామన్ మెన్) గా కొంతమందిని ఎంపిక చేసి బిగ్ బాస్ 10 షోలోకి పంపించారు.

ఈ షోలో ప్రత్యర్థులతో పోటీ పడలేక అందరూ ఎగ్జిట్ అవ్వగా, టాప్ ఫైవ్ లో ఇండియా వాలే మన్వీర్, మన్నూ పంజాబీ, గుర్బానీ జడ్జ్, లోపముద్ర రౌత్, రోహన్ మొహ్రా నిలిచారు. అనంతరం రోహన్, మన్నూ పంజాబీ, లోపముద్ర రౌత్ ప్రేక్షకుల నిర్ణయంతో నిష్క్రమించగా, హోరాహోరీ ఫైనల్స్ లో నిజాయతీ, స్నేహం, వివాదాస్పద సమయంలో తగ్గడం, ప్రారంభం నుంచి నిలకడ.. వంటి లక్షణాలతో భారతీయుల మనసులు గెలుచుకున్న మన్ వీర్ విజేతగా అవతరించాడు.

 దీంతో 40 లక్షల రూపాయల బహుమతి సంపాదించుకున్నాడు. విజయం సాధించిన అనంతరం మాట్లాడుతూ, తనకు సెలబ్రిటీ హోదా సరిపోదని, తాను కామన్ మెన్ గా ఉండేందుకే ఇష్టపడతానని చెప్పాడు. ప్రైజ్ మనీని సల్మాన్ బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ కు ఇస్తానని మన్ వీర్ తండ్రి ప్రకటించారు. కాగా, మన్ వీర్ ఈ షోలో పాల్గొనక ముందు ఏడేళ్లు తండ్రితో మాట్లాడకపోవడం విశేషం. వివాహం చేసుకో అన్న ప్రతిసారీ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడంతో ఆగ్రహం చెందిన తండ్రి మన్ వీర్ తో మాట్లాడలేదు. షోలో తనపై తన కుమారుడికున్న గౌరవానికి ముగ్ధుడైన తండ్రి షో మధ్యలో మాట్లాడారు. దీంతో దేశం యావత్తూ తండ్రీకొడుకుల అనుబంధానికి ముగ్ధులయ్యారు. సల్మాన్ ఖాన్ సహా అంతా మన్ వీర్ విజయాన్ని ఆస్వాదించడం విశేషం. 

More Telugu News