: ఏం ఫర్లేదు, మేమున్నాం... ట్రంప్ ఆదేశాలపై ఉద్యోగులకు అభయమిస్తూ యాపిల్ చీఫ్ టిమ్ కుక్ లేఖ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఇమిగ్రేషన్ ఆదేశాలు సృష్టించిన భయాందోళనల నుంచి తమ ఉద్యోగులకు ఊరట కలిగించేందుకు టెక్ దిగ్గజం యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ కదిలారు. ఇప్పటికే ఐఎస్ ఐటీ దిగ్గజ సంస్థల్లోని ప్రధాన ఉద్యోగులైన సుందర్ పిచాయ్, లారీ పేజ్, ఎలాన్ ముస్క్ వంటి వారు బహిరంగంగానే ట్రంప్ ఆదేశాలపై నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. టిమ్ తన ఉద్యోగులకు ఈ-మెయిల్ లేఖను రాస్తూ, ఉద్యోగులకు, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చి పని చేస్తున్న వారికి అండగా ఉంటామని భరోసాను ఇచ్చారు.

వీసాల విధానం పారదర్శకంగా, సులభతరంగా ఉండటం ఐటీ కంపెనీలకు ఎంతో మఖ్యమని, వాషింగ్టన్ అధికారులతో తాను ఇప్పటికే మాట్లాడానని, విదేశీ ఉద్యోగులు లేకుంటే యాపిల్ ఇంత ఎత్తునకు ఎదిగి ఉండదని అన్నారు. ఉద్యోగుల్లో చాలా మంది కొత్త ఆదేశాలతో ఆందోళన చెందుతున్నారని, మనం మద్దతివ్వాల్సిన విధానం ఇది కాదని అన్నారు. ఇమిగ్రేషన్ ఆదేశాల ప్రభావం పడే ఉద్యోగులకు సహాయం చేసేందుకు ఇప్పటికే హెచ్ ఆర్, లీగల్, సెక్యూరిటీ విభాగాలను ఏర్పాటు చేశామని, ఉద్యోగులకు అవసరమైన అన్ని సహాయాలనూ ఈ టీమ్ అందిస్తుందని తెలిపారు. ఏవైనా అనుమానాలుంటే, ఈ బృందాన్ని సంప్రదించాలని కోరారు. యాపిల్ సంస్థ నైపుణ్యానికి ఎల్లప్పుడూ తలుపులు తెరిచే వుంటుందని, ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం యాపిల్ ఉద్యోగుల సొంతమని చెప్పారు.

More Telugu News