: లోకేష్ తో కలసి చంద్రబాబు ఆమరణ దీక్ష చేయాలి... కాస్త చోటిస్తే నేనూ కూర్చుంటా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేందుకు తన కుమారుడు లోకేష్ తో కలసి సీఎం చంద్రబాబునాయుడు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవాలని కాపు వర్గం నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. అదే దీక్షలో చంద్రబాబు పక్కన తనకు కాస్తంత చోటిస్తే, తాను కూడా దీక్షలో కూర్చుంటానని చెప్పారు. ఈ ఉదయం కాకినాడలో మీడియాతో మాట్లాడిన ముద్రగడ, చంద్రబాబు గట్టి పట్టుదలను ప్రదర్శిస్తే, హోదా వస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. పరిస్థితిని చూస్తుంటే మాత్రం రాష్ట్రంలో ఉద్యమాలను అణచి వేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోందని, అదే నిజమైతే, ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు సాధించే వరకూ తాను నిద్రపోనని వ్యాఖ్యానించిన ముద్రగడ, త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.

More Telugu News