: తన పేరును ఆ సంస్థ దుర్వినియోగం చేస్తోందంటూ కోర్టును ఆశ్రయించిన ధోనీ

ఓ మొబైల్ కంపెనీతో గతంలో తాను కుదుర్చుకున్న డీల్ ను రద్దు చేసుకున్న తరువాత కూడా, సదరు సంస్థ తన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా తన పేరును వాడుకుంటోందని ఆరోపిస్తూ, టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. మాక్స్ మొబిలింక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఐదేళ్ల క్రితం తాను డీల్ కుదుర్చుకున్నాని, ఆపై డిసెంబర్ 2012లోనే అది ముగిసిందని చెప్పిన ధోనీ, అప్పుడు తనతో తీసిన చిత్రాలతో ఇప్పటికీ ఆ సంస్థ ప్రచారం చేసుకుంటోందని ఆరోపించాడు.

తన పేరును దుర్వినియోగం చేస్తోందని, గతంలో ఈ విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చినా సదరు సంస్థ ఖాతరు చేయలేదని గుర్తు చేశాడు. కేసును విచారించిన న్యాయమూర్తి మన్మోహన్ సింగ్, మాక్స్ మొబిలింక్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ లో ధోనీ చిత్రాలు లేకుండా చూసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలియజేయాలని ఆదేశిస్తూ, కేసు తదుపరి విచారణను జూలై 28కి వాయిదా వేశారు.

More Telugu News