devineni: ఇంత దుర్మార్గంగా ప్ర‌చారం చేస్తున్నావు.. ఇక కట్టిపెట్టు!: జ‌గ‌న్‌పై మంత్రి దేవినేని మండిపాటు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... ఎన్నో అవినీతి కేసులున్న జ‌గ‌న్ త‌మ‌ని విమ‌ర్శిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. జ‌గ‌న్ అస‌త్య‌ప్ర‌చారం చేస్తున్నారని, రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వ‌లేక త‌ట్టుకోలేక ప్రాజెక్టుల‌ని అడ్డుకుంటున్నారని ఆయ‌న ఆరోపించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకి జ‌గ‌న్‌ అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని, రైతుల‌తో కోర్టుల్లో కేసులు వేయిస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాను ప్ర‌జ‌లు ఆయ‌న‌కు ఇస్తే అందుకు త‌గ్గ‌ట్లు జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు.

రైతుల‌ను రెచ్చ‌గొడుతూ ఆనాడు కూడా ప‌ట్టిసీమకు అడ్డుపడ్డారని, ఇప్పుడు ప‌ట్టిసీమ ద్వారా ఎన్నో ఎక‌రాల‌కు నీరందుతోందని దేవినేని చెప్పారు. ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా అభివృద్ధి ఆగ‌దని ఉద్ఘాటించారు. జ‌గ‌న్‌లో అస్స‌లు మార్పు రావ‌డం లేదని అన్నారు. జ‌గన్ తీరును చూసే ఆ పార్టీ నేత‌లు టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. తనలో వున్న అప్ర‌జాస్వామిక తీరుని జగన్ ఇక కట్టిపెట్టాలని, ఎంతో దుర్మార్గంగా ప్ర‌చారం చేస్తున్నాడ‌ని, వాటిని న‌మ్మ‌డానికి ప్ర‌జ‌లు సిద్ధంగా లేరని అన్నారు.

More Telugu News