: పూణే ఇన్ఫోసిస్ ఆఫీసులో కలకలం... ఆఫీసులోనే హత్యకు గురైన మహిళా టెక్కీ

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో పని చేస్తున్న మహిళా ఉద్యోగి కార్యాలయంలోనే దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. పూణెలోని రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్ లోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో పనిచేస్తున్న కేరళకు చెందిన టెక్కీ ఆనంద్ కే రాసిలా రాజు (25) విగతజీవిగా కనిపించింది. కార్యాలయంలోని తొమ్మిదవ అంతస్తులో విధుల్లో ఉన్న సమయంలో రాసిలాను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కంప్యూటర్ కు వాడే వైరుతో మెడకు ఉరి బిగించి హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.

 ఆ సమయంలో బెంగళూరులోని ఇన్ఫీ టీమ్ తో ఆన్ లైన్లో ఆమె పని చేసుకుంటున్నట్టు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ ఘటన నిన్న సాయంత్రం జరిగింది. ఆఫీసు సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం కావడంతో ఆఫీసులో ఎవరూ లేరని, పని చేస్తున్న రాసిలాను పలకరించేందుకు మేనేజర్ ఫోన్ చేయగా సమాధానం రాకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్టు పుణె అసిస్టెంట్ కమిషనర్ వైశాలి జాదవ్ వెల్లడించారు.

More Telugu News