: నరాలు తెగే ఉత్కంఠతో సాగిన రెండో టీ20లో భారత్ విజయం!

రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయాన్ని సొంతం చేసుకుంది. స్టార్ బౌలర్ ఆశిష్ నెహ్రా స్థాయికి తగ్గ ఆటతీరుతో మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చాడు. మ్యాచ్ ఆరంభంలోనే రెండు వరుస బంతుల్లో వికెట్లు తీసి శభాష్ అనిపించుకున్న నెహ్రా, ఇంగ్లండ్ ఆటగాళ్లు పాతుకుపోయిన దశలో మరోవికెట్ (బెన్ స్టోక్స్) తీసి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చాడు. నాగ్ పూర్ లోని విదర్భ స్టేడియంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 144 పరుగులు చేసిన భారత జట్టు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్ కావడంతో ఆటగాళ్లు ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా ఆడారు.  
 
ఈ క్రమంలో ఓపెనర్లు బిల్లింగ్స్ (12), జాసన్ రాయ్ (10), మోర్గాన్ (17), బెన్ స్టోక్స్ (38) పరుగులు సాధించారు. జోరూట్ (38) క్రీజులో పాతుకుపోగా, అతనిని చివరి ఓవర్ తొలి బంతికి బుమ్రా పెవిలియన్ కు పంపాడు. దీంతో మ్యాచ్ మరింత రసకందాయంలో పడింది. దీంతో జోస్ బట్లర్ (15) పై బాధ్యత పడింది. జట్టును విజయతీరాలకు చేర్చే బాధ్యతను తీసుకున్న బట్లర్ ను జస్ ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతితో పెవిలియన్ కు పంపాడు. దీంతో రెండు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన జోర్డన్ బీట్ చెయ్యకపోయినా రన్ తీసి విజయానికి పరుగు దూరం తగ్గించాడు. చివరి బంతిని మొయిన్ అలీ బీట్ చేయలేకపోవడంతో ఇంగ్లండ్ జట్టు ఐదు పరుగుల తేడాతో పారాజయం పాలైంది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి, సిరీస్ పై ఆసక్తిని పెంచింది.

More Telugu News