: పెద్ద నోట్ల రద్దు 2016లో అతిపెద్ద కుంభకోణం: చిదంబరం
2016లో నోట్ల రద్దు అంశం అతి పెద్ద కుంభకోణం అని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానించారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. చిన్న వ్యాపారులు వ్యాపారం జరక్క దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో వంద శాతం నగదురహిత లావాదేవీలు తీసుకొస్తామని ప్రధాని చెబుతున్న మాటలు బూటకమని ఆయన చెప్పారు. అమెరికా, యూరోప్ సహా ప్రపంచంలోని ఏ దేశంలోనూ వంద శాతం నగదు రహిత లావాదేవీలు అమలు కావడం లేదని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో నగదుతోనే రోజువారీ లావాదేవీలు నిర్వహించుకుంటారని, వారి నుంచి డబ్బులు తీసుకుని, నగదు రహిత లావాదేవీలు అనడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.