: నవ్వుతూ వెళ్లండి, మంచి మార్కులు తెండి... మోసం చేయొద్దు సుమా: విద్యార్థులకు మోదీ పిలుపు

ఈ సంవత్సరంలో వివిధ తరగతుల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవ్వుతూ పరీక్షలకు వెళ్లి, చక్కగా రాసి, మంచి మార్కులతో పాస్ కావాలని ప్రధాని మోదీ అభిలషించారు. ఈ ఉదయం 28వ విడత 'మన్ కీ బాత్'లో భాగంగా ఆలిండియా రేడియో మాధ్యమంగా మోదీ ప్రసంగించారు. పరీక్షలంటే భయపడాల్సిన అవసరం లేదని, పరీక్షలు రాయడాన్ని ఓ పండగలా భావించాలని, ఆనందంగా ఉండాలని ఆయన కోరారు. జవాబుపత్రంపై పెట్టే ప్రతి అక్షరం వెనుకా నమ్మకం ఉండాలని సూచించారు. ఎంత ప్రశాంతంగా పరీక్షలు రాస్తే, అన్ని ఎక్కువ మార్కులు తెచ్చు కోవచ్చన్న విషయాన్ని మరువరాదని సలహా ఇచ్చారు.

చదువులో నిమగ్నమైన వేళ, చిన్న చిన్న విరామాలు తప్పనిసరిని, మధ్యలో దీర్ఘ శ్వాస తీసుకోవడం ద్వారా రిలాక్స్ కావచ్చని చెప్పారు. పరీక్షలు రాసి వచ్చిన తరువాత ఆట పాటలకు సమయం కేటాయించాలని కోరారు. పరీక్షల్లో మోసం చేస్తే వచ్చే లాభం తాత్కాలికమేనని, దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలు జీవితానికి ఉపకరించవన్న విషయాన్ని తల్లిదండ్రులే స్వయంగా పిల్లలకు అర్థమయ్యేట్టు తెలియజేయాలని మోదీ చెప్పారు. మోసం చేయడానికి, చూసి కాపీ కొట్టడానికి వాడే తెలివితేటలను సక్రమంగా వినియోగిస్తే, అదే పరీక్షలను ఫస్ట్ లో పాస్ చేయిస్తుందని అన్నారు.

ఫిబ్రవరి 1కి భారత తీర ప్రాంత రక్షకదళం ఏర్పడి 40 సంవత్సరాలు గడిచిన విషయాన్ని మన్ కీ బాత్ లో మోదీ ప్రస్తావించారు. తీరాన్ని రక్షించడంలో ఈ దళం అహర్నిశలూ శ్రమిస్తోందని, తీర రక్షక దళంలో పురుషులతో పాటు సమానంగా మహిళలూ ఉన్నారని, వారందరికీ దేశ ప్రజల తరఫున అభినందనలని మోదీ వ్యాఖ్యానించారు.

More Telugu News