: అత్తింటి వేధింపుల బాధిత మెడికోకు నన్నపనేని భరోసా.. నిందితుడ్ని జైలుకి పంపిస్తామని హెచ్చరిక!

గుంటూరు జిల్లా వేటపాలెంకు చెందిన మెడికో లక్ష్మికి మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి అండగా నిలిచారు. గుంటూరు జీజీహెచ్ లో వైద్యుడిగా పని చేస్తున్న సాయికృష్ణ, అతని కుటుంబ సభ్యులు మెడికో లక్ష్మిని వరకట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ నిన్నటి నుంచి మీడియాలో వార్తలొచ్చాయి. దీనికి స్పందించిన నన్నపనేని ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భగా కాపురానికి రావాలంటే కనుక 15 కోట్ల రూపాయలు తీసుకుని రావాలని, అలా కాకుండా తనకు విడాకులిస్తే కనుక తానే 20 లక్షల రూపాయలు ఇస్తానని భర్త సాయికృష్ణ, అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారని తెలియడంతో సాయికృష్ణపై నన్నపనేని మండిపడ్డారు. నిందితుడ్ని జైలుకి పంపిస్తామని హెచ్చరించారు.

 కాపురాన్ని సరిదిద్దుకుంటే జీవితం ఆనందంగా ఉంటుందని, ఆడపిల్ల చాలా మంచిదని, గతంలోనే తాను ఆమెతో మాట్లాడానని, ఇంత జరిగినా అతను వస్తే కాపురానికి వెళ్తానని చెబుతోందని, రక్షణ లేని ఇంటికి కాపురానికి వెళ్లడానికి ఎవరైనా భయపడతారని, కానీ ఆమె ఎంతో మంచిది కావడంతో సర్దుకుపోతానంటోందని ఆమె అన్నారు. ఆమెకు ఏపీ మహిళా కమీషన్ అండగా నిలుస్తుందని, రాజకీయ ఒత్తిళ్లు పని చేయవని, ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడానని, ఆమెకు ఒక కానిస్టేబుల్ రక్షణగా ఉంటారని, ఆమె విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆమె చదువుతున్న మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తో మాట్లాడానని, ఆమెకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తనను సంప్రదించవచ్చని నన్నపనేని భరోసా ఇచ్చారు. 

More Telugu News