chandrababu: భాగస్వామ్య సదస్సు ఫ‌లితం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి భారీ స్థాయిలో పెట్టుబ‌డులు

నిన్న విశాఖపట్నంలో ప్రారంభ‌మైన భాగస్వామ్య సదస్సు ఫ‌లితంగా ఈ రోజు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి భారీగా పెట్టుబ‌డులు వ‌చ్చాయి. ఈ రోజు ఏకంగా రూ.10.25 లక్షల కోట్ల పెట్టుబడులకు పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సదస్సులో కుదిరిన 665 అవగాహన ఒప్పందాల ఫ‌లితంగా రాష్ట్రంలో మొత్తం 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొర‌క‌నున్నాయి. అమరావతికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సీఆర్‌డీఏ పరిధిలో మొత్తం రూ.1.29లక్షల కోట్ల విలువైన 62 ఒప్పందాలు ఈ రోజు కుదిరాయ‌ని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

అందులో రచన సాయి ఇన్‌ఫ్రాటెక్‌ తో రూ.2500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింద‌ని, దీంతో 15వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌ తో రూ.5వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింద‌ని, దీంతో 2వేల మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని, షాపూర్జీ -పల్లోంజీ లతో రూ.6వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింద‌ని, దీంతో 10 వేలమందికి ఉపాధి దొరుకుతుంద‌ని చెప్పారు. ఇక‌ టాటా పవర్‌ కంపెనీతో రాష్ట్రానికి రూ.12,500 కోట్ల పెట్టుబడులకు అవగాహనా ఒప్పందం కుదిరింద‌ని, దీంతో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ పెట్టుబడులతో 6365 మందికి ఉపాధి ల‌భించ‌నుంద‌ని చెప్పారు.

More Telugu News