venkaiah naidu: కొంతమంది పనిలేక ట్విట్టర్‌పై కూర్చుంటున్నారు!: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

త‌మిళ‌నాడులో జల్లికట్టు క్రీడను 2011లోనే కాంగ్రెస్‌ పార్టీ నిషేధించిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... త‌మ పార్టీ జల్లికట్టు కోసం ఆర్డినెన్స్‌ ఇచ్చిందని తెలిపారు. జల్లికట్టు ముసుగులో త‌మ‌పై ప‌లువురు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కొంత మంది పనిలేక సామాజిక మాధ్య‌మం ట్విట్ట‌ర్‌పై కూర్చుంటున్నారని వెంక‌య్య అన్నారు. అందులో వారికి ఫాలోయింగ్ కూడా లేద‌ని, వారి ట్విట్ట‌ర్‌ పో‌స్టులు వృథాయేనని చెప్పారు. ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీకి మాత్రం ట్విట్ట‌ర్‌లో లక్షలమంది ఫాలోవ‌ర్లు ఉన్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

త‌మ‌ పార్టీని భారతీయ జనుల పార్టీగా పోల్చుకుంటున్నారని వెంక‌య్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో స‌ర్కారు పథకాలకు నెహ్రూ కుటుంబం పేర్లే పెట్టుకున్నారని ఆయ‌న విమ‌ర్శించారు. ఆ పార్టీని రద్దుచేయాలని మహాత్మాగాంధీ అప్పుడే అన్నార‌ని చెప్పారు. ఆ పార్టీ తీరు చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే విధంగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఉన్న ఏ కాంగ్రెస్‌ నేత కూడా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదని ఆయ‌న అన్నారు. చేనేత రాట్నం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ కూర్చుంటే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించేందుకే మోదీ రాట్నం దగ్గర కూర్చున్నారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నిక‌ల్లోనూ మోదీయే ప్ర‌ధానిగా గెలవాల‌ని దేశంలోని 62 శాతం మంది ప్రజలు కోరుకుంటున్న‌ట్లు స‌ర్వేలు చెబుతున్నాయని ఆయ‌న అన్నారు.

More Telugu News