: భారత్ పర్యటనలో కష్టాలు తప్పవు: ఆసీస్ కు పాంటింగ్ సూచన

భారత పర్యటనలో ఆస్ట్రేలియా జట్టుకు కష్టాలు తప్పవని ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ హెచ్చరించాడు. పాకిస్థాన్ తో జరిగిన టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి, వన్డేల్లో 4-1 తేడాతో విజయం సాధించి జోరుమీదున్న ఆస్ట్రేలియా జట్టుకు భారత్ లో కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయని అన్నాడు. గతంలో అంటే నాలుగేళ్ల క్రితం టెస్టు సిరీస్ కోసం భారత్ లో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టు క్లీన్ స్వీప్ అయిందని గుర్తు చేశాడు. ఈ మధ్యకాలంలో భారత్ లో పర్యటించిన ఏ జట్టు విజయం సాధించలేదని గుర్తుచేశాడు.

అంతేకాదు, పేస్ కు అనుకూలించే ఆసీస్ పిచ్ లకు ఉపఖండం పిచ్ లు పూర్తి భిన్నంగా ఉంటాయని, ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్ వనరులున్న భారత్ ను ఓడించడం సులువు కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. గత ఆగస్టులో శ్రీలంకలో ఆడిన ఆసీస్ ఓటమిపాలైన విషయాన్ని గుర్తు చేశాడు. సవాళ్లతో కూడిన భారత పర్యటనలో విజయం సాధించేందుకు సాధన ముఖ్యమని తెలిపాడు. ఫిబ్రవరి 23న పూణెలో నిర్వహించనున్న తొలి టెస్టుతో ఆసీస్ తో సిరీస్ ప్రారంభం కానుంది. 

More Telugu News