: నువ్వు నాకంటే తెలివైన వాడివా?: '10 టీవీ' రిపోర్టర్ పై చంద్రబాబు సీరియస్

నువ్వు నాకంటే తెలివైనవాడివా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 10 టీవీ రిపోర్టర్ పై మండిపడ్డారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదాను మించిన సాయం చేస్తామని కేంద్రం చెప్పిందని తెలిపారు. విభజన చట్టంలో ప్రత్యేకహోదాను కాంగ్రెస్ పెట్టలేదని ఆయన అన్నారు. అలాంటప్పుడు హోదా కావాలని ఎలా ప్రశ్నిస్తామని చెప్పారు. కేంద్రం తమకు అన్ని విషయాల్లో సహకరిస్తోందని, అలాంటప్పుడు కేంద్రంతో ఘర్షణ ఎందుకని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న ప్రతి విషయాన్ని అమలు చేస్తున్నప్పుడు మళ్లీ ఆందోళనలు ఎందుకని అడిగారు.

కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన చెప్పారు. భాగస్వామ్య సదస్సును విఫలం చేయాలన్న లక్ష్యంతోనే ఆందోళన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడిరేపి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంలో 10 టీవీ రిపోర్టర్ కల్పించుకుని, 'ఇండస్ట్రియల్ ఇన్సెన్టివ్స్ వస్తాయని అంతా చెబుతున్నార'నగానే అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, 'నువ్వే ఛానెల్ రిపోర్టర్?' అని ప్రశ్నించారు. 'స్పెషల్ స్టేటస్ లో ఇండస్ట్రియల్ ఇన్సెన్ టివ్స్ ఉన్నాయని ఎవరు చెప్పారు? ఆ జీవో చూపించగలవా? నువ్వు నాకంటే తెలివైన వాడివా? అయితే చూపించు... నేనేం చెబుతున్నానో అది విను' అంటూ కాస్త అసహనం వ్యక్తం చేశారు.

తనను ప్రొవోక్ చెయ్యవద్దని సూచించారు. జాతీయ ఛానెల్స్ తాను ఎలా చెబితే అలా రాసుకున్నాయని, స్టేట్ మీడియా మాత్రం రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ వంటివి రావాల్సి ఉందని, వాటికోసం అడుగుతామని ఆయన చెప్పారు. బకాయిలు చెల్లించాలని అడుగుతున్నామని, కేంద్రం కూడా సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. ప్రజలను విపక్ష పార్టీలు తప్పుదోవపట్టిస్తున్నాయని ఆయన తెలిపారు. 

More Telugu News