special status: రేపు దేశం గ‌ర్వ‌ప‌డే రోజు.. ఆ రోజున ఇటువంటి కార్య‌క్ర‌మాలు ఏమిటి?: హోదా పోరాటంపై మంత్రి దేవినేని రుసరుసలు

ఆగ‌స్టు 15, జ‌న‌వ‌రి 26 దేశ ప్ర‌జ‌లు గ‌ర్వ‌ప‌డే దినోత్స‌వాలు అని, ఎంతో ప్ర‌త్యేకమైన రోజుల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. ఆ రోజు కూడా ఇటువంటి కార్య‌క్ర‌మాలు ఏమిటని ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని ఉద్దేశిస్తూ ఆయ‌న ప్ర‌శ్నించారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కుతంత్రాల‌తో మాట్లాడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు త‌మ ప్ర‌భుత్వం ఎప్ప‌టికీ సిద్ధ‌మేన‌ని చెప్పారు. ప్ర‌త్యేక హోదాకు బ‌దులు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి పోల‌వ‌రం వంటి ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను సాధించామ‌ని తెలిపారు.

అసెంబ్లీలో తాము అడుగుతున్న‌ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉత్త‌ర కుమారుడిలాగా వెన్నుచూపి పారిపోతున్నారని దేవినేని అన్నారు. అటువంటి జ‌గ‌న్ ఇప్పుడు త‌మ‌పై ఎన్నో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ప‌రిశ్ర‌మ‌లు ఎక్క‌డ ప్రారంభ‌మ‌య్యాయో.. ఎన్ని ప్రారంభం కాబోతున్నాయో త్వ‌ర‌లో ప్రారంభం కానున్న అసెంబ్లీ స‌మావేశాల్లో చెప్ప‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని అన్నారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వంపై తాము ఒత్తిడి తీసుకొస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

More Telugu News