: జగన్ తో ఎన్నడూ గొడవలు పడలేదు... రాజకీయాల నుంచి తప్పుకుంటానే తప్ప మరోసారి పార్టీ మారను!: భూమా నాగిరెడ్డి

తాను వైకాపా అధినేత జగన్ తో ఎన్నడూ గొడవలు పడలేదని, తమ ఇద్దరి మధ్యా పాలసీ నిర్ణయాల్లో తేడాలు వచ్చాయే తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి పొరపొచ్చాలు రాలేదని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైకాపాను వీడాల్సి వచ్చిందని, అంతకన్నా ఇంకేమీ లేదని చెప్పారు. తానేమీ చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవులను ఆశించలేదని, ఒకవేళ ఆశించి వుంటే, పదవి తీసుకున్న తరువాతనే పార్టీలో చేరుండే వాడినని అన్నారు.
తమ నేతను మంచి పొజిషన్ లో చూడాలని నంద్యాల ప్రాంతంలోని తన కార్యకర్తలు భావిస్తున్నారని చెప్పారు. జగన్ ను విమర్శించడం వెనుక చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేయాలన్న ఆలోచనేమీ లేదని స్పష్టం చేశారు. తాను వాస్తవాలనే మాట్లాడుతున్నానని భూమా వెల్లడించారు. తెలంగాణలో కూడా పార్టీలు మారుతున్నారని, వైకాపా రాష్ట్ర అధ్యక్షుడే పార్టీ మారాడని గుర్తు చేశారు. తాను పార్టీని వీడితే సస్పెండ్ చేసే ధైర్యం కూడా వైకాపాకు లేకపోయిందని విమర్శించారు. ఇకపై తాను మరో పార్టీ మారబోనని, పరిస్థితి అనుకూలం కాదని భావిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. 

More Telugu News