: నష్టపరిహారంలో వివక్ష కూడదు.. జనసేన డిమాండిదే!: పవన్ కల్యాణ్

భూముల సేకరణకు ముందు ఎంతమేరకు నష్టపరిహారాన్ని రైతులకు ఇస్తామని చెబుతారో అంత మొత్తం ఇవ్వాల్సిందేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పట్టా రైతులకు ఒక రకంగా, లంక భూముల రైతులకు మరోలా వివక్ష చూపిస్తున్నారని ఆరోపించిన ఆయన, సేకరించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుంటే, వాటిని సాగు భూములుగానే రైతులకు వదిలేయాలని జనసేన డిమాండ్ చేస్తున్నట్టు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

అసలు గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనల ప్రకారం, నది పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టరాదని గుర్తు చేసిన ఆయన, నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకున్నదో లేదో స్పష్టత కొరవడిందని ఆరోపించారు. భూములను తీసుకుని ఏం చేస్తారన్న విషయాన్ని ప్రజలకు లేదా కనీసం రైతులకైనా తెలియజేయాలని డిమాండ్ చేశారు. సమాజ వికాసాన్ని కాంక్షించే వారు అమరావతి కృష్ణా నదీ లంక భూముల రైతుల బాధలను అర్ధం చేసుకోవాలని కోరారు. తాము దళితులమైనందునే నష్ట పరిహారం చెల్లింపులో వివక్షకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఇది సమాజానికి మంచిది కాదని హెచ్చరించారు.

More Telugu News