: తీరని పన్నీర్ సెల్వం ఆశ... ఏమీ చేయలేక చెన్నై తిరుగుపయనం!

జల్లికట్టు పోటీలను ప్రభుత్వం తరఫున ప్రారంభించడం ద్వారా, తమిళ యువతలో నెలకొన్న ఆగ్రహాన్ని, కొనసాగుతున్న ఆందోళనలను తగ్గించాలన్న ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆశ తీరలేదు. ఆర్డినెన్స్ వచ్చినా సంతృప్తి చెందని తమిళ తంబీలు శాశ్వత పరిష్కారం కోసం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మదురైకి వచ్చిన పన్నీర్ సెల్వం తొలుత అలంగనల్లూరులో జల్లికట్టును ప్రారంభించాలని భావించారు.

అక్కడి ప్రజలు నిరసనలు కొనసాగిస్తుండటం, ఎద్దులను సిద్ధం చేయకపోవడంతో ఇక దిండిగల్ లో ప్రారంభించాలని భావించి, తన కార్యక్రమాన్ని మార్చుకున్నారు. అక్కడ కూడా ఇదే విధమైన పరిస్థితి కనిపించడంతో చేసేదేమీలేక చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యారు. తమిళనాడు యువత కోపాగ్ని తగ్గుతుందని ఆయన భావించినప్పటికీ, వారి నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం జల్లికట్టు పోటీలు ప్రారంభమైనట్టు సమాచారం అందుతోంది. ఇక జల్లికట్టుపై ఏ విధమైన ఆదేశాలు జారీ చేయాలన్నా, తమ వాదన వినాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ ను దాఖలు చేసింది.

More Telugu News