: సోనియా కల్పించుకోవడంతో కుదిరిన పొత్తు... కాంగ్రెస్ కు 105, ఎస్పీకి 298

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో కొత్త పొత్తు పొడిచింది. తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తో చేతులు కలిపారు. నిన్నటి వరకూ పోటీ చేసే సీట్ల పంపిణీ విషయంలో ఏకాభిప్రాయం కుదరక పోగా, కాంగ్రెస్ అధినేత్రి స్వయంగా కల్పించుకోవడంతో సమస్య సద్దుమణిగింది. ఈ ఉదయం అఖిలేష్ తో సోనియా గాంధీ మాట్లాడగా, తొలుత ఆఫర్ చేసిన 99 స్థానాలతో పాటు మరో ఆరు స్థానాలను అధికంగా ఇచ్చేందుకు అఖిలేష్ వర్గం సమ్మతించింది.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 105 సీట్లను ఇచ్చేందుకు సమాజ్ వాదీ అంగీకరించింది. తాము 298 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతామని ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాంగ్రెస్ కు ఆఫర్ చేస్తున్న స్థానాల విషయంలో కొన్ని చోట్ల అభ్యంతరాలున్నాయని, ఆ పార్టీ డిమాండ్ చేస్తున్న కొన్ని చోట్ల తమ పార్టీ బలంగా ఉందని, ఈ స్థానాలపై చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తామని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇరు పార్టీలూ కలసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

More Telugu News