: ఎన్టీఆర్ మ్యూజియాన్ని ఫైనార్ట్స్ కు వేదికగా తీర్చిదిద్దుతాం: నారా లోకేష్ దంపతులు
ఎన్టీఆర్ మ్యూజియాన్ని స్మారక చిహ్నంగానే కాకుండా ఫైన్ ఆర్ట్స్ కు వేదికగా నిర్మించబోతున్నామని నారా లోకేష్ దంపతులు పేర్కొన్నారు. విజయవాడ సిద్దార్థ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మ్యూజియాన్ని నారా లోకేష్, బ్రహ్మణి, తనయుడు దేవాన్ష్ తో కలిసి ఎన్టీఆర్ చిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ దంపతులు మాట్లాడుతూ, అమరావతిలో నిర్మించనున్నఎన్టీఆర్ మ్యూజియాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతిరోజూ రెండు వేల మందికి పైగా మ్యూజియాన్ని సందర్శిస్తున్నారని, వచ్చే ఏడాది మరింత ఎక్కువ మంది సందర్శకులకు అవకాశం కల్పించేలా తీర్చిదిద్దుతామన్నారు. అరుదైన చిత్రాలు, వీడియోలను సేకరించే కార్యక్రమంలో భాగంగా తమ వద్ద ఉన్న వాటిని ఎన్టీఆర్ ట్రస్టుకు పంపించాలని ఈ సందర్భంగా బ్రహ్మణి కోరారు.