: 'తమిళనాడుకు, మనకు ఇంత తేడా ఉంది' అంటూ పంజాబ్ సీఎంపై నిప్పులు చెరిగిన సిద్ధూ

కాంగ్రెస్ పార్టీలో తాజాగా చేరిన నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ తన ప్రచార పర్వం ప్రారంభించాడు. క్రికెట్ వ్యాఖ్యాతగా, కామెడీ షో జడ్జిగా రాణించిన మాజీ క్రికెటర్ సిద్ధూకు పంజాబ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మాటకారి అయిన సిద్ధూ తన వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటాడు. ఈ నేపథ్యంలో సిద్ధూ తన గళం విప్పాడు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 6,323 మద్యం దుకాణాలు ఉన్నాయని చెప్పాడు. వాటి ద్వారా ఆ రాష్ట్రానికి ఆదాయం 26,188 కోట్ల రూపాయలు ఏటా సమకూరుతోందని చెప్పాడు. అదే సమయంలో 12,500 మద్యం దుకాణాలున్న పంజాబ్ రాష్ట్రంలో వాటి ద్వారా ఖజానాకు సమకూరే ఆదాయం కేవలం 5,610 కోట్ల రూపాయలు మాత్రమేనని మండిపడ్డారు. తమిళనాడుకు, మనకు ఇంతే తేడానా? అని ఆయన ప్రశ్నించారు.

 వాస్తవానికి ఈ తేడా చాలా ఉంటుందని, అయితే లెక్కల్లోకిరాని ఆ ప్రభుత్వ సొమ్మంతా ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కుటుంబానికి చెందిన బొక్కసంలోకి చేరుతోందని ఆయన నిప్పులు చెరిగారు. ఈ అవినీతి కేవలం మద్యానికి మాత్రమే పరిమితం కాదని, ట్రాన్స్  పోర్ట్‌, టూరిజం.. ఇలా ప్రభుత్వ రంగాలన్నింటినీ బాదల్‌ కుటుంబం లూటీ చేస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల క్రితం బాదల్ కుటుంబాని కేవలం 50 బస్సులు మాత్రమే ఉండేవని, మరి ఇప్పుడు ఆ కుటుంబానికి 650 బస్సులున్నాయని ఆయన తెలిపారు. ఇదే సమయంలో పంజాబ్ ప్రభుత్వ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ నష్టాల్లో కూరుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక లేదని, బేషరతుగానే కాంగ్రెస్ లో చేరానని ఆయన చెప్పారు. 

More Telugu News