: మరో ట్వీట్ తో వివాదంలో చిక్కుకున్న 'దంగల్' నటి జైరా వసీం!

'దంగల్' సినిమాతో సూపర్ స్టార్ డమ్ సంపాదించుకున్న కశ్మీరీ యువతి జైరా వసీం (16) ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఆమె కశ్మీర్ ముఖ్యమంత్రిని కలవడం వివాదం కాగా, కశ్మీరీలకు క్షమాపణలు చెప్పిన ఆమెకు బాలీవుడ్ మొత్తం మద్దతు పలికింది. దీంతో తాను క్షమాపణలు చెప్పిన ట్వీట్ ను తీసేసింది. తాజాగా, కేంద్ర మంత్రి విజయ్ గోయల్ ఢిల్లీలో జరిగిన 'ద ఇండియా ఆర్ట్ ఫెస్టివల్' కు వెళ్లారు. అక్కడ హిజాబ్ (బుర్ఖా) ధరించి ఉన్న యువతి, ఆ పక్కనే పంజరంలో మరో యువతి ఉన్న ఓ చిత్రం మంత్రిని బాగా ఆకట్టుకుంది. దీంతో దానిని తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఆయన, 'దీనిని చూస్తుంటే జైరా వసీం గుర్తుకొస్తోంది, పంజరాన్ని పగులగొట్టి మన ఆడపిల్లలు ప్రగతి దిశగా పరుగులు తీస్తున్నారు' అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

దీనిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన జైరా వసీం...హిజాబ్ వేసుకున్న అమ్మాయిలు అందంగా స్వేచ్ఛగా ఉంటారని పేర్కొంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు పోస్ట్ చేసిన ఫోటోలో అమ్మాయిలకు, తనకు ఎలాంటి పోలిక లేదని తెలిపింది. దీంతో మళ్లీ స్పందించిన విజయ్ గోయల్ 'నువ్వు నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నావు...నేను నిన్ను పొగిడాను, పురుషాధిక్య అభిప్రాయాలు మారాలని చెప్పాను...అయితే నువ్వింకా నన్ను అర్ధం చేసుకోకపోవడం బాధాకరం, అయినప్పటికీ నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా'నని ఆయన తెలిపారు. దీనికి ఆమె సమాధానం ఇవ్వలేదు. 

More Telugu News