: 9000 మంది ఉద్యోగులను ఇంటికి పంపిన ఇన్ఫోసిస్!

దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఏడాది కాలంలో 9000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ కృష్ణమూర్తి శంకర్ తెలిపారు. ప్రతి త్రైమాసికంలో దాదాపు 2000 మంది ఉద్యోగులను తొలగించామని చెప్పారు. అయితే, వారందరికీ స్పెషల్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే తొలగించామని తెలిపారు. ఈ ట్రైనింగ్ వారికి తదుపరి ఉద్యోగాల్లో ఉపయోగపడుతుందని చెప్పారు.  ఆటోమేషన్ రంగం తీవ్రంగా విస్తరిస్తోందని... ఈ నేపథ్యంలోనే ఉద్యోగులను తొలగించామని తెలిపారు.

దీనికి తోడు, అంచనాల మేర కంపెనీ రాణించలేకపోయిందని... ఇది కూడా ఉద్యోగుల తొలగింపుకు మరో కారణమని చెప్పారు. ఈ ఏడాది తొమ్మిది నెలల కాలంలో ఇన్ఫోసిస్ 5700 మందిని మాత్రమే నియమించుకుందని... గత ఏడాది ఇదే కాలంలో 17,000 మందిని నియమించుకుందని అన్నారు. ఈ మధ్య కాలంలో పెద్దపెద్ద ఐటీ కంపెనీలు ఆటోమేషన్ ప్రక్రియపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి. బీపీఓ, అప్లికేషన్ మేనేజ్ మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ మెంటుపై పెట్టుబడులను క్రమేపీ తగ్గిస్తున్నాయి. దీంతో, ఇలాంటి సమస్య ఎదురవుతోంది. 

More Telugu News