: ఫేస్‌బుక్‌లో ‘గుడ్‌బై’ అని మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి

ఫేస్‌బుక్‌లో 'గుడ్ బై' అని మెసేజ్ పెట్టి ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో  చోటు చేసుకుంది. త‌మ మిత్రుడు సంప్రీత్ బెనర్జీ ఫేస్‌బుక్‌లో పెట్టిన గుడ్ బై మెసేజ్‌ని చూసిన అత‌డి స్నేహితులు... సంప్రీత్ ఏదైనా టూర్‌కి వెళుతున్నాడేమోన‌ని అనుకున్నారు. అతడి వ‌ద్ద‌ ఆత్మ‌హ‌త్య లేఖ కూడా ల‌భించ‌క‌పోవ‌డంతో ఆ విద్యార్థి ఎందుకు ఈ ప‌నిచేశాడ‌న్న విష‌యం గురించి తెలియ‌రాలేదు. అయితే, ఇటీవ‌ల స్కూల్లో నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో త‌క్కువ మార్కులు వ‌చ్చినందుకే సంప్రీత్ ఆత్మహ‌త్య చేసుకున్న‌ట్లు అత‌డి కుటుంబ స‌భ్యులు అనుమానిస్తున్నారు. త‌మ కుమారుడు ఇలా చేస్తాడని అనుకోలేదని అతడి తల్లిదండ్రులు అన్నారు.

ఒక టీచర్ సంప్రీత్‌ని త‌రచు బాగా అవమానిస్తున్నారని అత‌డి స్నేహితులు తెలిపారు. కాగా, టీచర్ సంప్రీత్‌ను అందరిముందు శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెడుతున్నట్లు అతడి తల్లి అపర్ణ ఆరోపించారు. అత‌డు చ‌దివేది కో ఎడ్యుకేషన్ స్కూలు కావడం, అతడు అప్పటికే టీనేజికి రావడంతో త‌న కుమారుడు త‌ర‌గ‌తిలో జ‌రుగుతున్న అవ‌మానానికి క్రుంగిపోయి ఈ ఘ‌టన‌కు పాల్ప‌డ్డాడ‌ని ఆమె చెప్పారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో త‌న తోటి విద్యార్థుల‌లాగే తాను కూడా అవే సమాధానాలు రాసినా తనకు ఎందుకు తక్కువ మార్కులు వేశారని సంప్రీత్ త‌న టీచ‌ర్‌ను అడిగినప్పటి నుంచి ఆ టీచర్ అత‌డిని కొట్టడం మొదలుపెట్టార‌ని, ఒక‌సారి ఆ టీచ‌ర్ అత‌డిని చెంపమీద కొట్టి త‌ర‌గ‌తి గ‌ది నుంచి బయటకు పంపేశారని సంప్రీత్ స్నేహితుడు ఒక‌రు చెప్పాడు.

More Telugu News