somi reddy: మ‌రో రాజ‌కీయ నాయకుడైతే సిగ్గుతో త‌ల‌దించుకొని రాజీనామా చేసిపోయేవాడు: జగన్ పై సోమిరెడ్డి ఆగ్రహం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు అమ‌రావ‌తితో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.... రైతుల‌పై జ‌గ‌న్‌కు ఏ మాత్రం ప్రేమ‌లేద‌ని అన్నారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబుపై జ‌గ‌న్‌ సంస్కారం లేకుండా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అన్నారు. జ‌గ‌న్‌ వయసెంతా?.. ఆయ‌న‌ స్థాయి ఎంత‌? అని సోమిరెడ్డి ప్ర‌శ్నించారు. ఎన్నో కేసుల్లో ఉన్న జ‌గ‌న్ సిగ్గులేకుండా రాజ‌కీయ నాయ‌కుడిగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నాడ‌ని, మ‌రో రాజ‌కీయ నాయకుడైతే సిగ్గుతో త‌ల‌దించుకొని రాజీనామా చేసిపోయేవాడని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే నైతిక హ‌క్కు జ‌గ‌న్‌కు లేదని అన్నారు.  
 
భూమా నాగిరెడ్డి కుమార్తె, ఎమ్మెల్యే అఖిల‌ ప్రియపైకి రౌడీల‌ను పంపించి, కారుని ఆపి దాడికి దిగడం స‌రికాద‌ని సోమిరెడ్డి అన్నారు. అఖిల అక్క‌డ‌కు వ‌స్తుంద‌నే ప‌క్కా స‌మాచారాన్ని అంద‌జేసి వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తో దాడి చేయించార‌ని ఆయ‌న అన్నారు. ఆమె పార్టీ మారింద‌ని వైసీపీ నేత‌లు అంటున్నార‌ని, మ‌రి జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీ మార‌లేదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. జ‌గ‌న్‌కో న్యాయం, అఖిల‌కో న్యాయ‌మా..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. జ‌గ‌న్‌ రౌడీ రాజ‌కీయాల‌ను మానుకోవాల‌ని ఆయ‌న సూచించారు. అఖిల‌ ప్రియ‌పై దాడి చేయ‌డాన్ని జ‌గ‌న్ ఎలా స‌మ‌ర్థించుకుంటార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

More Telugu News