: ప్లాస్టిక్ బాటిల్స్ రీ సైక్లింగ్ తో దుప్పట్ల తయారీ.. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు ఇచ్చేవి అవే!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ సంస్థ తమ ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్ల విషయంలో వినూత్న బాట పట్టింది. పర్యావరణానికి భారంగా మారుతున్న ప్లాస్టిక్ బాటిల్స్ ను రీ సైకిల్ చేయడం ద్వారా ఈ దుప్పట్లను  తయారు చేస్తోంది. మొదట.. బాటిల్స్ ను రీ సైకిల్ చేసి ప్లాస్టిక్ చిప్స్ రూపంలోకి తీసుకువస్తారు. ఆ తర్వాత వాటి నుంచి పోలార్ ప్లీస్ మెటీరియల్ ఉత్పత్తి చేసి, దానిలోని మృదువైన దారాలతో దుప్పట్లు తయారు చేస్తారు. ఈ దుప్పట్లను ఆస్ట్రేలియాకు చెందిన ‘బజ్’ అనే సంస్థ భాగస్వామ్యంతో  ఎమిరేట్స్ సంస్థ తయారు చేస్తోంది.

‘ఎమిరేట్స్’లో ఎకానమీ క్లాసు ప్రయాణికులకు ఈ దుప్పట్లను ఇస్తున్నామని, 28 ప్లాస్టిక్ బాటిల్స్ తో ఒక దుప్పటిని తయారు చేయవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. భూమికి భారంగా, పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ బాటిల్స్ ను అలా వదిలివేయకుండా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే వీటి తయారీని ప్రారంభించామని,  2019 నాటికి ఎకో-త్రెడ్ దుప్పట్ల తయారీకి 88 మిలియన్ల ప్లాస్టిక్ బాటిల్స్ ను వినియోగించనున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. 

More Telugu News