: ‘మాలి’లో దారుణం... ఆత్మాహుతి దాడిలో 40 మంది మృతి

ఆఫ్రికా ఖండంలోని మాలి దేశంలో దారుణం జరిగింది. ఒక వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంఘటనలో సుమారు 40 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మాలి ఉత్తర భాగంలోని గావో ఎయిర్ పోర్టు సమీపంలో మాజీ తిరుగుబాటుదారులు, సైనికుల స్థావరాలు ఉన్నాయి. ఈ స్థావరాల వద్దకు కారులో వచ్చిన ఒక వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనలో నలభై మంది అక్కడికక్కడే మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కాగా, ఈ సంఘటనపై మాలి దేశాధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కెయిటా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.

More Telugu News