: ఎయిర్ టెల్ (ఇండియా) సీఎంవో గా రాజ్ పూడిపెద్ది నియామకం

ఎయిర్ టెల్ (ఇండియా) కార్యకలాపాల డైరెక్టర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సీఎంవో)గా రాజ్ పూడిపెద్ది నియమితులయ్యారు. ఈ మేరకు  సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఎయిర్ టెల్ మేనేజ్ మెంట్ బోర్డులో కూడా ఆయన భాగస్వామి కానున్నారని పేర్కొంది.  ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇండియా, దక్షిణాసియా) గోపాల్ విఠల్ మాట్లాడుతూ, పలు సంస్థల్లో కీలక పదవుల్లో పని చేసిన రాజ్ పూడిపెద్ది అనుభవంపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. కొత్త బాధ్యతలు స్వీకరించనున్న రాజ్ కు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారులకు సంబంధించి మరిన్ని కొత్త కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన రాజ్, ఐఐఎం లక్నోలో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పటి వరకు పలు సంస్థల్లో కీలక పదవులు నిర్వహించిన ఆయనకు  22 సంవత్సరాల అనుభవం ఉంది.

More Telugu News