: పాక్ తో బంధం అత్యంత సంక్లిష్టం: ట్రంప్ ను హెచ్చరించిన ఒబామా సర్కారు

పాకిస్థాన్ తో స్నేహ బంధాన్ని కొనసాగించడం అత్యంత సంక్లిష్టమైన అంశమని ఒబామా సర్కారు హెచ్చరించింది.  అమెరికాను మరింత సురక్షితంగా చేసేందుకు, ఉగ్రవాదుల నిర్మూలనకు ట్రంప్ నేతృత్వంలో రానున్న ప్రభుత్వం కృషి చేస్తుందనే భావిస్తున్నట్టు తెలిపింది. కొన్ని దేశాలతో అమెరికా సంబంధాలు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని, ముఖ్యంగా పాకిస్థాన్ వంటి దేశాలతో జాగ్రత్తగా ఉండాలని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ వ్యాఖ్యానించారు.

ఉగ్రవాదాన్ని అరికట్టడం, ఉగ్రవాదులపై పోరాడటంలో అమెరికా, పాక్ లు మరింతగా కృషి చేయాల్సి వుందని, ఈ విషయంలో రెండు దేశాల ప్రయోజనాలనూ దృష్టిలో ఉంచుకోవాలని, పాక్ సైతం ఉగ్రవాదంతో నష్టపోయిందని ఆయన అన్నారు. ఆఫ్గన్, పాకిస్థాన్ రీజియన్లో అల్ ఖైదాను అణిచేందుకు కట్టుబడతానన్న ఒబామా, తన హామీని నిలుపుకున్నారని గుర్తు చేసిన జోష్, ఎన్నో ఏళ్ల పోరాటం అనంతరం అల్ ఖైదా మూలాలను నాశనం చేశామని తెలిపారు. అయితే, ఇంకా ప్రమాదం సమసిపోలేదని, అక్కడ ఇంకా నాటో దళాలను కొనసాగించాల్సి వస్తోందని తెలిపారు. ఒబామా మొదలు పెట్టిన కార్యాన్ని ట్రంప్ పూర్తి చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News