: అనూహ్య నిర్ణయం... వైసీపీలోకి డీఎల్ రవీంద్రారెడ్డి... వెలసిన ఫ్లెక్సీలు

గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడ్డ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, ఇప్పుడు వైకాపాలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. జగన్ పేరు వింటేనే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ విమర్శలు చేసే డీఎల్, మారిన రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న ఇబ్బందికర పరిణామాలతో గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే.

2014 ఎన్నికలకు ముందు టీడీపీలో ఆయన చేరనున్నారన్న ప్రచారం జరిగినప్పటికీ, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయమై స్పష్టత రాకపోవడంతో తన ఆలోచనను డీఎల్ విరమించుకున్నారు. ఇక తాజాగా మైదుకూరు నియోజకవర్గంలో వైకాపా ఏర్పాటు చేసిన సంక్రాంతి ప్లెక్సీల్లో డీఎల్ ఫోటోను కూడా చేర్చడంతో ఆయన చేరికపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక అదే జరిగితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేదా శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరని మరోసారి తేటతెల్లమవుతుంది.

More Telugu News