: ఆప్తమిత్రుడు ములాయంకు షాకివ్వనున్న అమర్ సింగ్!

సమాజ్ వాదీ పార్టీలో విభేదాలకు, తండ్రీ కొడుకుల మధ్య గొడవలకు తాను కూడా కారణమని వస్తున్న ఆరోపణలతో మనస్తాపం చెందిన అమర్ సింగ్, తన ఆప్త మిత్రుడికి షాకిచ్చే నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఓ జాతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ, అమిత్ షాతో తాను మంతనాలు జరిపినట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. బీజేపీలో ఎప్పుడు చేరాలని అనుకున్నా, ఆ విషయాన్ని అందరికీ చెప్పే వెళతానని అన్నారు.

తాను నేతాజీ మనిషినేనని, ములాయం తనను శత్రువుగా చూడబోరన్న విశ్వాసం తనకుందని అన్నారు. అఖిలేష్ యాదవ్ పై తనకెంతో ప్రేమ ఉందని, అతను ఎన్ని మాటలన్నా భరించే ఓపిక తనకుందని చెబుతూ, ప్రస్తుతం తాను అటు ములాయం వైపునగానీ, ఇటు అఖిలేష్ వైపుగానీ లేనని తెలిపారు. కాగా, ప్రస్తుతం సమాజ్ వాదీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అమర్ సింగ్, ఎంపీ పదవికి రాజీనామా చేసే విషయంలో మాత్రం ఏ వ్యాఖ్యలూ చేయలేదు.

More Telugu News