: ఏపీ ఎమ్మెల్సీ 'వాకాటి' ఆస్తుల‌ను స్వాధీనం చేసుకున్న బ్యాంకులు.. రూ.443.27 కోట్ల అప్పులున్నాయ‌న్న అధికారులు

వీఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌, పవర్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌కు హామీదారుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ‌రెడ్డి ఆస్తుల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు వివిధ బ్యాంకులు ప్ర‌క‌టించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద‌రాబాద్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ నుంచి ఈ మూడు కంపెనీలు మొత్తం రూ.443.27 కోట్ల రుణం తీసుకున్నాయి.

అయితే, వీటిని తిరిగి చెల్లించ‌డంలో విఫ‌లం కావ‌డంతో రుణాల‌కు హామీదారుగా ఉన్న నారాయ‌ణ‌రెడ్డికి సంబంధించిన ఆస్తుల‌తోపాటు కంపెనీల పేరిట ఉన్న ఆస్తుల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు సదరు బ్యాంకులు ప్ర‌క‌టించాయి. స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట‌లోని కొన్ని స్థిరాస్తుల‌తోపాటు కొన్ని భూముల‌ను కూడా స్వాధీనం చేసుకున్న‌ట్టు బ్యాంకులు పేర్కొన్నాయి. కాగా, రుణం చెల్లింపున‌కు ఇచ్చే హెచ్చ‌రిక నోటీసులు త‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కు లిఖిత పూర్వ‌కంగా బ్యాంకుల నుంచి అంద‌లేద‌ని ఎమ్మెల్సీ తెలిపారు.

More Telugu News