: 'అమ్మకు నేత చీర లేదు... పిన్నమ్మకు పట్టు చీర తెస్తా' అన్నట్లుంది చంద్రబాబు వ్యవహారం: రోజా

రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ చివరకు రైతులను నిండా ముంచేసిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. గత మూడేళ్లుగా రైతులు దరిద్రాన్ని అనుభవిస్తున్నారని... అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. రైతు బాంధవుడిగా చంద్రబాబు చెప్పుకుంటుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతుల పక్షపాతి దివంగత రాజశేఖరరెడ్డే అని అన్నారు. గత ఏడాది 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైడిపాలెం ప్రాజెక్టుకు వైయస్ హయాంలో రూ. 660 కోట్లు ఖర్చు చేస్తే... కేవలం రూ. 23 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, ప్రాజెక్టు కట్టిన ఘనత తనదేనంటూ చంద్రబాబు చెప్పుకోవడం దారుణమని అన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులు కూడా వైయస్ హయాంలోనే వచ్చాయని చెప్పారు. రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే... అమ్మకు నేత చీర లేదు... పిన్నమ్మకు పట్టుచీర తెస్తానన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. సంక్రాంతి సంబరాలు చంద్రబాబు ఇంట్లోనే కనిపిస్తున్నాయని... పల్లెల్లో కనిపించడం లేదని వ్యంగ్యంగా అన్నారు. 

More Telugu News