: అసదుద్దీన్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్: షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు

ముస్లింల మక్కా యాత్రకు సబ్సిడీ అవసరం లేదన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తప్పుబట్టారు. అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ మెప్పు కోసం చేసినట్టున్నాయని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ లా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. 1932లో బ్రిటీష్ కాలంలోనే సబ్సిడీ కార్యక్రమం ప్రారంభమైందని షబ్బీర్ తెలిపారు. కేవలం ముస్లింలకే కాకుండా మానస సరోవర్ వెళ్లడానికి హిందువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

2004లో రూ. 74 లక్షలు ఉన్న మీ ఆదాయం, 2014 నాటికి రూ. 4 కోట్లకు ఎలా పెరిగిందో చెప్పాలని ఈ సందర్భంగా అసద్ ను షబ్బీర్ డిమాండ్ చేశారు. ముస్లింలకు ఇస్తున్న సబ్సిడీని రద్దు చేసి, ఆ నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించాలని అసద్ కోరడం తప్పని అన్నారు. 'నువ్వు, నేను డబ్బున్నవాళ్లం కాబట్టి మక్కాకు ఎన్ని సార్లైనా వెళ్లివస్తాం. మరి పేద ముస్లింలు మక్కాకు వెళ్లవద్దా?' అని ప్రశ్నించారు.

ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచేలా అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుపై న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. కోర్టులో సైతం నిలబడేలా బిల్లు ఉండాలని... కోర్టులో బిల్లు నిలబడకపోతే దానికి కేసీఆరే బాధ్యత వహించాలని అన్నారు.

More Telugu News