: ప్రియురాలి కోసం యజమానికే టోకరా వేసి అడ్డంగా బుక్కయిన విశాఖ టెక్కీ!

ప్రియురాలికి ఖరీదైన బహుమతులు కొనిస్తూ, ఆమెను మరింత సంతోషపెట్టడానికి అవసరమైన డబ్బు కోసం, పని చేస్తున్న యజమానినే బ్లాక్ మెయిల్ చేసి అడ్డంగా దొరికిపోయాడో ఐటీ ఉద్యోగి. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, పోతిన మల్లయ్య పాలెంలోని బింద్రానగర్‌ కు చెందిన ముదునూరి సాయి వంశీ (26) అలియాస్‌ రాజు అనే యువకుడు రుషికొండలోని క్లోవ్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో సీనియర్‌ క్యాడ్‌ ఇంజినీర్‌ గా పనిచేస్తున్నాడు. ఈ కుర్రాడు గత కొంత కాలంగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. అమెకు ఖరీదైన బహుమతులు ఇస్తూ, పార్టీలకు తిప్పుతుండేవాడు. ఇద్దరి లగ్జరీలకూ తన జీతం రూ. 20 వేలు సరిపడక, రూ. 5 లక్షల వరకూ అప్పులు చేశాడు. వీటిని తీర్చే మార్గం కనిపించక, సంస్థ యజమానినే బ్లాక్ మెయిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

క్లోవ్‌ టెక్నాలజీలో బాంబులు పెట్టామని, వీటిని తీయాలంటే కోటి రూపాయలను 24 గంటల్లోగా ఇవ్వాలని ఈ-మెయిల్ పెట్టాడు. డబ్బు ఎక్కడికి తేవాలో తరువాత చెబుతానని అన్నాడు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు మద్దిలపాలెంలోని ఓ ఇంటర్నెట్ కేంద్రం నుంచి ఈ మెయిల్ వచ్చినట్టు గుర్తించారు. ఆపై బాంబ్‌ స్క్వాడ్‌ తో తనిఖీలు చేయగా, ఎలాంటి బాంబులూ దొరకలేదు. ఆపై వలపన్నిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారించి నిజం కక్కించారు.

More Telugu News