: జగన్ కి తండ్రి బుద్ధులు రాలేదు...తాత గుణాలన్నీ వంటబట్టాయి: జేసీ దివాకర్ రెడ్డి

ఫ్యాక్షన్ గొడవలు రేపేందుకు జగన్ సిద్ధమవుతున్నాడని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. కడపజిల్లా పైడిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జగన్ ప్రతిదాన్నీ విమర్శిస్తుంటాడని మండిపడ్డారు. జగన్ కు నాయన బుద్ధులు రాలేదని, తాత బుద్ధులు వచ్చాయని ఆయన చెప్పారు. రాజారెడ్డికి ఏం తెలుసు? చెయ్యి నరకడం, తల నరకడం, కాలు నరకడం తెలుసని ఆయన విమర్శించారు. అలాంటి బుద్ధే ఉన్న వాడిని జగన్ ఇప్పుడు తాడిపత్రికి పార్టీ ఇన్ ఛార్జిగా పెట్టాడని ఆయన మండిపడ్డారు.

అంటే మళ్లీ గొడవలు రేపాలని చూస్తున్నాడని ఆయన విమర్శించారు. రక్తపాతాన్ని అందరూ మర్చిపోయారని, జగన్ మళ్లీ రక్తపాతం రేపేందుకు వస్తున్నాడని ఆయన చెప్పారు. ప్రతి వ్యక్తికి కృతజ్ఞత ఉండాలని ఆయన సూచించారు. కుక్కకి కూడా కృతజ్ఞత ఉంటుందని ఆయన తెలిపారు. అలా కృతజ్ఞత లేకపోతే మనుషులమనిపించుకోమని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో అంటే 2019లో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన సూచించారు. అలా చేస్తే పులివెందులకు గోదావరి నీళ్లు వస్తాయని ఆయన చెప్పారు. 

More Telugu News