chandrababu: వైన్ షాపుల వైపు వెళ్లకండి!: ముఖ్యమంత్రి చంద్రబాబు
తాను ప్రజల కోసం కష్టపడతానని, ప్రజలు కూడా తాను చేసే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు కడప జిల్లాలోని పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం
ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పలు సూచనలు చేశారు. మద్యానికి అలవాటు పడకూడదని చెప్పారు. బెల్టుషాపులకు, వైన్ షాపులకు వెళ్లడం మానేయాలని సూచించారు. తాగితే కొద్దిగా కిక్కు వస్తుందని, రోజంతా కష్టపడి సాయంత్రం కష్టాలు మరచిపోవాలని వైన్ షాపుకి వెళుతున్నారని ఆయన అన్నారు. మెల్లిగా ఆ వ్యసనానికి బానిసలు అవుతున్నారని చెప్పారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన రావాలని చెప్పారు.
ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా చైతన్యవంతులను చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఎంతో మంది వ్యక్తులు ఒక్కపెగ్గుతో మొదలు పెట్టి మద్యానికి బానిసలుగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. తాము పేదల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని చంద్రబాబు అన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఎంతో ఖర్చు చేస్తున్నామని తెలిపారు.