suicide: ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌... 'ఆడ‌పిల్ల‌గా పుడితే ఇన్ని వేధింపులు భ‌రించాలా?' అంటూ సూసైడ్ నోట్

ఆక‌తాయిల వేధింపులకు మ‌రో విద్యార్థిని బ‌ల‌యింది. పోకిరీల వేధింపులు భ‌రించ‌లేక చ‌నిపోతున్నానంటూ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని విజ‌య‌వాడ‌లో అనిత అనే ఓ ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆ సూసైడ్ నోట్‌లో స‌ద‌రు విద్యార్థిని ఆడ‌పిల్ల‌గా పుట్టిన పాపానికి చాలా బాధ‌లు ప‌డ్డాన‌ని పేర్కొంది. ఆడ‌పిల్ల‌గా పుడితే ఇన్ని వేధింపులు భ‌రించాలా? అని ప్ర‌శ్నించింది.

ఈ ఘ‌ట‌న‌పై ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ.. నిన్న సాయంత్రం కాలేజీ నుంచి షేర్ ఆటోలో త‌మ కూతురు ఇంటికి వ‌చ్చిందని, అయితే ఆ ఆటోలో త‌న కూతురిని డ్రైవ‌ర్‌తో పాటు ప‌లువురు వేధించార‌ని తెలిపారు. నిన్న సాయంత్రం ఇంట్లో త‌మ‌ కూతురు ఏడుస్తూ కూర్చుంద‌ని, తాము న‌చ్చ‌జెప్పామ‌ని అనిత తండ్రి ప్రసాద్ తెలిపారు. కాలేజీకి వెళ్లేస‌మ‌యంలో ధైర్యంగా ఉండాల‌ని చెప్పామ‌ని, అయితే ఈ రోజు ఉద‌యం ఉరివేసుకొని క‌నిపించింద‌ని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ఆ విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ లో తనను ఎవరు వేధించారో వారి పేర్లు రాయలేదని తెలిపారు. కొందరు వేధిస్తున్నారని మాత్రమే రాసిందని చెప్పారు.


More Telugu News