: మీకు జేజేలు కొట్టడానికి కూలీలు కావాలంటే సంప్ర‌దించండి... వినూత్న ప్ర‌క‌ట‌న‌!

మీ ఇంట్లో గ్యాస్ స్టౌ, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల రిపేర్‌, ప్లంబ‌రింగ్ ప‌నులు చేయ‌డానికి ప‌నివారు కావాలా? అయితే సంప్ర‌దించండి... అంటూ ప‌లుచోట్ల అతికించిన‌ ప్ర‌క‌ట‌న‌ల‌ను మ‌నం ప్ర‌తిరోజు చూస్తూనే ఉంటాం. అయితే, చెన్నయ్‌లోని సెమ్మంజేరికి చెందిన ఆటో డ్రైవర్‌ వివేకానందన్‌ తన ఆటోపై ఉంచిన ఓ ప్రకటనను చూస్తే మాత్రం ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఆయ‌న ఆటో వెన‌కవైపు ‘కూలి మనుషులు కావాలంటే సంప్ర‌దించండి’ అని ఓ ప్ర‌క‌ట‌న క‌నిపిస్తోంది. అందులో "భవిష్యత్తు ప్రధానికి, ముఖ్య‌మంత్రికి జేజేలు కొడుతూ నినాదాలు చేయడానికి మ‌నుషులు కావాలా? అయితే, ఈ ఫోన్‌ నెంబరుకి సంప్ర‌దించండి" అంటూ ఓ ఫోన్‌నెంబ‌రు ఉంది. ప్రస్తుతం రాజకీయనాయకులకు జేజేలు కొట్టడానికి మనుషులు కావాలని తెలుసుకున్న సదరు డ్రైవరు ఈ ప్రకటన చేస్తున్నాడు. తద్వారా నిరుద్యోగులను ఆదుకుంటాడట.

ఈ విష‌యం గురించి ఆ ఆటోడ్రైవ‌ర్ మాట్లాడుతూ... తాను పదేళ్లుగా ఆటోను నడుపుతున్నానని చెప్పాడు. ఎనిమిదేళ్లుగా పేపర్లలో వచ్చే ప్ర‌ధాన‌ వార్తలను తన ఆటో వెనుక రాస్తున్నానని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం తమ ప్రాంతంలో కొంత మందికి ప‌నులు దొర‌క‌డం లేద‌ని, ప్రస్తుత రాజకీయాల్లో నేత‌ల‌కు జేజేలు కొట్టడానికి భారీ సంఖ్యలో మనుషులు అవసరమవుతున్నట్లు తాను తెలుసుకున్నానని, అందుకే తాను తన ఆటోపై ఆ ప్రకటన అంటించాన‌ని చెప్పాడు. రాజ‌కీయ‌నాయ‌కులు రోజుకు ఒక మనిషికి రూ.300 ఇస్తే తాను క‌నీసం 100 మందిని జేజేలు కొట్ట‌డానికి పంపించ‌గ‌లుగుతాన‌ని పేర్కొన్నాడు.

More Telugu News