: ఇండియాతో పోటీ పడేందుకు న్యూక్లియర్ అటాక్ సబ్ మెరైన్లు కొంటున్న పాక్!

ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన నౌకా దళాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచిన వేళ, ఇండియాతో యుద్ధం వస్తే, దీటుగా ఎదుర్కొనేందుకు తమకు సరిపడా నౌకాదళం లేదని భావిస్తున్న పాకిస్థాన్, తన మిత్రదేశమైన చైనా నుంచి న్యూక్లియర్ అటాక్ సబ్ మెరైన్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం మేలోనే చైనా జలాంతర్గాములు పాకిస్థాన్ లోని కరాచీ హార్బర్ కు వచ్చాయని, వీటిని పాక్ నావీ అధికారులు చూసి సంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. ఈ జలాంతర్గామి శాటిలైట్ చిత్రాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.

దాదాపు 7 వేల టన్నుల బరువుండే ఈ సబ్ మెరైన్ లో ఆరు టోర్పెడో ట్యూబ్ లుంటాయి. అణ్వాయుధాలను, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించగలుగుతుంది. ఇక ఇవి చేతికి వస్తే, హిందూ మహా సముద్రంలో, ముఖ్యంగా అరేబియా సముద్రంలో తమ బలం మరింతగా పెరుగుతుందని పాక్ భావిస్తోంది. సంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ ఇంజన్ కాకుండా, ఈ జలాంతర్గాముల్లో అణు రియాక్టర్ ఆధారంగా పనిచేస్తుందని తెలుస్తోంది. కాగా, తాము బాబర్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించామని పాక్ ఇటీవల ప్రకటించగా, అది అవాస్తవమంటూ తాజాగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News